గతంలో త్రిషపై వ్యాఖ్యలు చేసిన పార్తిబన్... సీఎం విజయ్ ని కలిశాడు!

  • తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో నటుడు పార్తిబన్ భేటీ
  • ప్రత్యేక పెయింటింగ్, అభినందిస్తూ లేఖ ఇచ్చిన పార్తిబన్
  • నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం తర్వాత తొలిసారిగా సమావేశం
  • విజయ్‌ను 'చక్రవర్తి'గా అభివర్ణించిన పార్తిబన్
  • పార్తిబన్ వ్యాఖ్యలపై గతంలో ఘాటుగా స్పందించిన త్రిష
ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్. పార్తిబన్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విజయ్‌ను అభినందిస్తూ స్వహస్తాలతో రాసిన లేఖతో పాటు, ప్రత్యేకంగా రూపొందించిన ఒక పెయింటింగ్‌ను ఆయనకు బహూకరించారు. నటి త్రిష కృష్ణన్‌పై పార్తిబన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొద్ది నెలలకే ఈ భేటీ జరగడం రాజకీయ, సినీ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కలయికకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

విజయ్ సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎందరికో స్ఫూర్తిదాయకమని పార్తిబన్ తన లేఖలో ప్రశంసించారు. ఆయన బహూకరించిన చిత్రపటంలో విజయ్ ఒక సింహాసనం పక్కన రాజసం ఉట్టిపడే వస్త్రధారణతో నిల్చుని ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా విజయ్‌ను పార్తిబన్ 'చక్రవర్తి' అని సంబోధించారు.

గత మార్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో త్రిష ఫొటోను చూసిన పార్తిబన్, "ఈ కుందవైని కొన్ని రోజులు ఇంట్లోనే ఉంచాలి, బయటకు రానివ్వకూడదు" అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా క్షమాపణలు కోరారు. దీనిపై త్రిష సైతం ఘాటుగా స్పందిస్తూ, "మైక్ దొరికినప్పుడల్లా మాట్లాడే ప్రతి మాటా తెలివైనది కాదని, అది ఒక్కోసారి మన మూర్ఖత్వానికి నిదర్శనం" అని 'ఎక్స్' వేదికగా బదులిచ్చారు.

R Parthiban
Vijay
Trisha Krishnan
Parthiban meets Vijay
Tamil Nadu Politics
Parthiban Trisha controversy

More Telugu News